మూడేళ్ళ బాలుడిని కాటేసిన కరోనా.. తెలంగాణాలో 41కి చేరిన కేసులు

గురువారం, 26 మార్చి 2020 (08:10 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం ఈ కేసుల సంఖ్య 41కి చేరింది. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ పరిధికి చెందిన మూడేళ్ళ బాలుడికి ఈ వైరస్ సోకింది. దీంతో ఆ పిల్లోడిని ఆస్పత్రికి తరలించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
 
హైదరాబాద్‌లోని గోల్కొండకు చెందిన బాధిత బాలుడి కుటుంబం ఇటీవల సౌదీ అరేబియా నుంచి నగరానికి వచ్చింది. ఆ వెంటనే బాలుడిలో జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం బాలుడికి పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
 
అలాగే, మరో మహిళకు కూడా ఈ వైరస్ సోకింది. రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన ఓ వ్యక్తి (49) కొన్ని రోజుల క్రితం లండన్ నుంచి వచ్చాడు. అతడికి ఇప్పటికే వైరస్ సోకగా, తాజాగా ఆయన భార్య (43)కు కూడా వైరస్ సోకినట్టు బుధవారం నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఈమెతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ రెండోదశకు గురైన కేసులు ఆరుకు చేరాయి. 
 
మరోవైపు, హైదరాబాద్ నగరంలోని నల్లకుంటలో ఉన్న ఫీవర్‌ ఆస్పత్రిలో బుధవారం నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలుత ట్రయల్ కింద 22 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఇక్కడ కేవలం ఐసోలేటెడ్‌ వార్డు మాత్రమే ఉండేది. కరోనా అనుమానితులను మాత్రమే ఈ వార్డులో పెట్టి వారి నుంచి సేకరించిన శాంపిళ్లను గాంధీ, ఉస్మానియా దవాఖానలకు పంపించి పరీక్షలు నిర్వహించేవారు. 
 
అక్కడ నుంచి రిపోర్టులు వచ్చిన తర్వాత పేషంటుకు అసలైన చికిత్స మొదలుపెట్టేవారు. పాజిటివ్‌ వస్తే ఎర్రగడ్డలోని ఛాతి వైద్యశాలకు పంపించేవారు. కానీ బుధవారం నుంచి ఇక్కడే పరీక్షలు మొదలయ్యాయని దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు. ఈ రిపోర్టు ఫలితాల్లో పాజిటివ్ అని తేలిన వారికి ఇకపై ఇదే ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు