500 టెస్టు మ్యాచ్‌కు అజరుద్దీన్‌ను ఆహ్వానించిన బీసీసీఐ

శనివారం, 17 సెప్టెంబరు 2016 (12:48 IST)
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌ చుట్టూ ఎన్ని విజయాలున్నాయో.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రూపంలో అన్ని వివాదాలూ ఉన్నాయి. అజర్‌ 99 టెస్టుల్లో 6215, 334 వన్డేల్లో 9378 పరుగులు సాధించిన ఈ హైదరాబాదీ క్రికెటర్ 2000 సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కారణంగా అజర్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే ఏళ్ల తరబడి జరిగిన విచారణ అనంతరం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2012లో ఆ నిషేధాన్ని కొట్టివేసింది. 
 
అజరుద్దీన్ మీద కోర్టు నిషేదం ఎత్తి వేసినా.... క్రికెట్ అభిమానుల్లో అసలు తెర వెనుక ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలనే కుతూహలం అలానే ఉండిపోయింది. అయితే తాజాగా న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరగనున్న చారిత్రక 500వ టెస్టుకు రావాల్సిందిగా అజర్‌కు బీసీసీఐ నుంచి ఆహ్వానం అందడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. చారిత్రక టెస్టుకు మాజీ కెప్టెన్లందరినీ ఆహ్వానించిన బోర్డు మొదట అజర్‌ ఆహ్వానించకూడదనే నిర్ణయం తీసుకుంది. 
 
అయితే ఏమైందో ఏమో తెలీదు కాని తన నిర్ణయాన్ని మార్చుకున్న బోర్డు అజర్‌‌కు ఆహ్వానం పంపింది. టెస్ట్‌‌ను తిలకించేందుకు అజర్ వస్తానని కూడా చెప్పాడట. అజర్‌‌‍‌ను ఆహ్వానించిన విషయాన్ని బోర్డు సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ నెల 22న ప్రారంభం కానున్న టెస్ట్‌ మ్యాచ్ భారత్‌కు 500వ మ్యాచ్. ఈ సందర్భంగా టీమిండియా మాజీ దిగ్గజాలని ఆహ్వానించిన బీసీసీఐ వారిని ఘనంగా సన్మానించనుంది. అంతేకాదు ''మాస్టర్ బ్లాస్టర్'' సచిన్ టెండూల్కర్ కూడా విచ్చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి