ఛాంపియన్స్ ట్రోఫీకి 8 ఏళ్లు: ధోని కెప్టెన్సీలో ఛాంపియన్‌గా నిలిచిన రోజు

బుధవారం, 23 జూన్ 2021 (13:49 IST)
ICC Champions Trophy
ఛాంపియన్స్ ట్రోఫీకి 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం జూన్ 23వ తేదీ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 8 ఏళ్ల క్రితం 2013లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను భారత జట్టు కైవసం చేసుకున్నది ఈ రోజునే. ఇంగ్లాండ్ వేదికగా.. 2013 జూన్ 23న ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు.. వన్డే క్రికెట్‌లో దేశాన్ని ఛాంపియన్‌గా నిలబెట్టింది.
 
భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది ఈ రోజునే. ఇప్పుడు 8 సంవత్సరాల తరువాత, విరాట్ కోహ్లీ సారథ్యంలో ఇంగ్లాండ్‌లో టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్, ఫైనల్ డే ఆడుతోంది. 2013లో కూడా వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడగా.. 2021లో ఇప్పుడు కూడా వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. 
 
టెస్ట్ ఛాంపియన్ టైటిల్ ఇప్పుడు నెగ్గడం మాత్రం కష్టమైన పనేనని నిపుణులు భావిస్తున్నారు. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 2013 సంవత్సరంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగా.. అప్పుడు భారత జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు.
 
అదే సమయంలో, ఈ రోజు మళ్ళీ అదృష్టం భారత జట్టును విశ్వవిజేతను చేస్తుందో లేదో? చూడాలి. ఇంగ్లండ్ గడ్డపై 2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాన్నందుకుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ టైటిల్ ఫైట్‌లో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచింది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 129 పరుగులే చేసింది. శిఖర్ ధావన్(31), విరాట్ కోహ్లీ(43), రవీంద్ర జడేజా(33 నాటౌట్) రాణించారు. అనంతరం ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులే చేసింది. 
 
ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే 18 ఓవర్‌లో ఇషాంత్ శర్మ వరుస బంతుల్లో ఇయాన్ మోర్గాన్, రవి బొపారాను ఔట్ చేయడం.. చివరి ఓవర్‌లో అశ్విన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ విజయాన్ని అందుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు