ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు!!

ఠాగూర్

గురువారం, 30 మే 2024 (12:48 IST)
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీలు త్వరలో ప్రారంభంకానున్నాయి. అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు పొంచివున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనిపై ఐసీసీ స్పందించింది. ప్రజా భద్రతకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని.. ప్రశాంతంగా మ్యాచ్‌లను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. న్యూయార్క్‌ జూన్ 3 నుంచి 12 వరకు తొమ్మిది మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. 
 
'న్యూయార్క్‌ స్టేట్ పోలీస్‌కు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి భద్రతను కట్టుదిట్టం చేయాలని చెప్పాం. ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. వరల్డ్ కప్‌ మ్యాచ్‌లను అందరూ ఆస్వాదించేలా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాం' అని న్యూయార్క్‌ గవర్నర్‌ కాతీ హోచుల్ వెల్లడించారు. 'ఈ మెగా టోర్నీని సురక్షితంగా నిర్వహించేందుకు మేం కూడా కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరి భద్రతే మాకు ముఖ్యం. దాని కోసం వివిధ అంచెల్లో సెక్యూరిటీని నియమించాం. ఆ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా తక్షణమే సరిదిద్దేందుకు సిద్ధంగా ఉంటాం' అని ఐసీసీ ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్‌ జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు