టీ20 ప్రపంచకప్‌-భారత్-పాక్ హై వోల్టేజ్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

సెల్వి

శుక్రవారం, 5 జనవరి 2024 (12:30 IST)
ఈ ఏడాది జూన్ నెలలో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీలో మరోసారి భారత్-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ (భారత్, పాకిస్థాన్ మ్యాచ్) జూన్ 9న జరగనుందని సమాచారం.
 
టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా గ్రూప్ Aలో ఉంది. ఇందులో భారత్, పాకిస్థాన్, ఆతిథ్య అమెరికా, ఐర్లాండ్, కెనడా ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 4 నుంచి జూన్ 30 వరకు టోర్నీ జరగనుండగా.. గ్రూప్ ఏలో దాయాది మ్యాచ్‌లపై సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 
 
2022 టీ20 ప్రపంచకప్, 2023 ఆసియాకప్, ప్రపంచకప్‌లో తలపడిన ఇండో-పాక్ జట్లు ఈ ఏడాది మరోసారి తలపడనున్నాయి. జూన్‌ 9న భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌కి న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
 
దీని ప్రకారం భారత్ తన తొలి మ్యాచ్‌ని ఐర్లాండ్‌తో ఆడనుంది. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్ ఘన విజయం సాధించింది. 
 
గతేడాది కూడా వన్డే ఫార్మాట్‌లో ఈ జట్లు మూడు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ రెండు మ్యాచ్‌ల్లో  గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు