చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. 800 పాయింట్లతో తొలి భారత వికెట్ కీపర్‌గా అదుర్స్

సెల్వి

గురువారం, 26 జూన్ 2025 (12:00 IST)
Rishabh Pant
ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ వివరాలను వెల్లడించింది. ఇటీవల భారతదేశం -ఇంగ్లాండ్ మధ్య ముగిసిన హెడింగ్లీ టెస్ట్‌లో కీలకమైన ఇన్నింగ్స్ తర్వాత భారతదేశానికి చెందిన రిషబ్ పంత్, ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ డకెట్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. 
 
ఈ క్రమంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. హెడింగ్లీ టెస్ట్‌లో తన జంట సెంచరీల తర్వాత రిషబ్ పంత్ తాజా ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏడవ స్థానానికి ఎగబాకాడు. ఈ అద్భుతమైన వికెట్ కీపర్-బ్యాటర్ 134, 118 స్కోర్‌లను నమోదు చేశాడు. అలాగే, 2001లో జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ ఘనతకు తర్వాత అతను రెండవ వికెట్ కీపర్ అయ్యాడు.
 
ఫలితంగా 27 ఏళ్ల పంత్ 800 రేటింగ్ పాయింట్లను సాధించిన తొలి భారత వికెట్ కీపర్ అయ్యాడు. గతంలో భారత వికెట్ కీపర్ సాధించిన అత్యుత్తమ రేటింగ్ ఎంఎస్ ధోని పేరిట వుంది. అతను 2008లో 662 రేటింగ్ పాయింట్లను సాధించాడు. జాతీయ జట్టు తరపున టెస్ట్ క్రికెట్‌లో పంత్ స్థిరమైన ప్రదర్శనలు ఇస్తున్నాడు. హెడింగ్లీ టెస్ట్‌లో కూడా తన ఫామ్‌ను కొనసాగించాడు.
 
ఇకపోతే.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో జో రూట్ ప్రపంచంలోనే నంబర్ 1 టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసిసి బౌలర్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు