మంచు దెబ్బకొట్టింది.. ఓటమి జీర్ణించుకోలేనిది : విరాట్ కోహ్లీ

సోమవారం, 11 మార్చి 2019 (12:02 IST)
మొహాలీ వేదికగా జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించడంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చెందడంతో చాలా బాధేస్తోందన్నారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. 358 పరుగుల భారీ లక్ష్యాన్ని పర్యాటక ఆస్ట్రేలియా జట్టు అలవోకగా ఛేదించింది. 
 
ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, తమ ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు గురించి మా అంచనా తప్పయింది. మంచు వల్ల చివర్లో మా బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదు. అయితే దీనిని మా ఓటమికి సాకుగా చెప్పను. ఆఖరి ఓవర్లలో ఐదు అవకాశాలు వృథా కావడం జీర్ణించుకోలేనిది. స్టంపింగ్‌ అవకాశం చేజారింది. ఫీల్డింగ్‌ బాగా లేదు. డీఆర్‌ఎస్‌ను సందేహించాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చింది. అస్టన్‌ టర్నర్‌, ఖవాజా, హ్యాండ్స్‌కోంబ్‌ల అద్భుతంగా ఆడారు. ప్రత్యర్ధి జట్టు మా కన్నా బాగా ఆడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల ఫలితాలతో మా కళ్లు తెరచుకున్నాయి. ఈ మ్యాచ్‌ ఫలితం మరో మాటకు తావు లేకుండా మమ్మల్ని చాలా బాధపెడుతోంది' అని చెప్పుకొచ్చరు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు శిఖర్ ధవాన్ (143), రోహిత్ శర్మ (95) అద్భుతంగా రాణించడంతో తొలి వికెట్‌కు రికార్డు స్థాయి భాగస్వామ్యం నెలకొల్పారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు కూడా తమ వంతు సహకారం అందించడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. 
 
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఆసీస్‌ను పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (105 బంతుల్లో 117, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఉస్మాన్‌ ఖాజా (99 బంతుల్లో 91; 7 ఫోర్లు)లు కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకోగా.. చివర్లో ఆస్టన్‌ టర్నర్‌ (43 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి జట్టును గెలిపించాడు. దీంతో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు 2-2 సమం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు