ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : సన్నాహక మ్యాచ్‌లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తు!!

ఠాగూర్

ఆదివారం, 2 జూన్ 2024 (09:28 IST)
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సన్నాహక మ్యాచ్‌లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిపోయింది. అమెరికా, వెస్టిండీస్ జట్లు ఆతిథ్యమిచ్చే ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా, భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య శనివారం నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో 60 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా అజేయ 40 పరుగులతో రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 60 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. 
 
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 కీలకమైన వికెట్లు తీశారు. ఇక ఆల్ రౌండర్ శివమ్ దూబే కూడా బౌలింగ్లో మెరిశాడు. 2 కీలకమైన వికెట్లు తీయడమే కాకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇతర బౌలర్లలో జస్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. జూన్ 5న ఐర్లాండ్ తొలి మ్యాచ్ ఆడడానికి ముందు సాధించిన ఈ విజయం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు