ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ రిలీజ్.. చెన్నైలో ఫైనల్ మ్యాచ్!!

వరుణ్

మంగళవారం, 26 మార్చి 2024 (14:37 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన రెండో దస షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పోటీల్లో భాగంగా తుది పోరుకు చెన్నై ఆతిథ్యమివ్వనుంది. సోమవారం బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్‌‍లో ఈ విషయాన్ని వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ రెండోదశను యూఏఈకి తరలిస్తారన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ.. స్వదేశంలోనే మిగిలిన మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసింది. 2011, 2012 తర్వాత చెన్నైలో ఫైనల్‌ను షెడ్యూల్ చేయడం ఇదే తొలిసారి. డిఫెండింగ్ చాంప్ హోదాలో టైటిల్ ఫైట్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం చెన్నైకు దక్కింది. ఒకవేళ సీఎస్కే ఫైనల్‌కు చేరితే సొంత ప్రేక్షకుల ముందు ధోనీ ఘనంగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. అంతేకాకుండా మే 24వ తేదీన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌కు కూడా చెపాక్ వేదిక కానుంది. 
 
అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో మే 21వ తేదీన క్వాలిఫయర్-1, 22వ తేదీన ఎలిమినేటర్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. తొలి దశలో 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేయగా.. వచ్చే నెల 8 నుంచి జరిగే రెండో దశలో మొత్తంగా 52 మ్యాచ్‌లు జరగనున్నాయి. పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకొని భద్రతా సమస్యలు తలెత్తకుండా ఉండేవిధంగా మ్యాచ్ తేదీలను ఖరారు చేశారు. 
 
పంజాబ్ కింగ్స్ రెండో హోంగ్రౌండ్ ధర్మశాలలలో, రాజస్థాన్ రాయల్స్ రెండో సొంత మైదానంగా భావిస్తున్న గౌహతిలో రెండేసి మ్యాచ్‌‌లను షెడ్యూల్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 20న సన్‌రైజర్స్‌తో తలపడుతుంది. మే 19న రాజస్థాన్ - కోల్కతా మ్యాచ్‌లో లీగ్ దశ ముగియనుంది. ఒక రోజు విరామం తర్వాత మే 21 నుంచి ప్లేఆఫ్స్ జరగనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు