దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్నవారంతా కలవరపాటుకు గురయ్యారు.
సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది ప్రధాన న్యాయమూర్తిపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్నారు. అనంతరం తన విచారణను కొనసాగించారు. ఘటనకు కారణమైన న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఓటు వేసేందుకు ముస్లిం మహిళలు బురాఖా తీయాల్సిందే.. బీజేపీ
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ సరికొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఓటు వేసేందుకు వచ్చే ముస్లిం మహిళలు బురాఖా తీయాల్సిందేనని పట్టుబడుతోంది. ఎందకుంటే.. ఓటర్ కార్డులోని ఫోటోతో ఓటు వేసేందుకు వచ్చిన మహిళ ఫోటోను సరిపోల్చుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే (ఎస్ఐఆర్) చేపట్టి ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా చేసిన నేపథ్యంలో బురఖాపై అభ్యంతరం చెప్పడం అర్థరహితమని వాదిస్తున్నారు. విద్వేష రాజకీయాలు చేయడం మానుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు.
అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానించింది. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ బీహార్ చీఫ్ దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఓటు వేయడానికి బురఖాలో వచ్చే మహిళలను ఓటర్ కార్డులోని ఫొటోతో సరిపోల్చుకోవాలని ఈసీని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లను అరికట్టేందుకు ఇది తప్పనిసరిగా చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు.
దిలీప్ జైస్వాల్ వ్యాఖ్యలపై ఆర్జేడీ తరపున మీటింగ్కు హాజరైన ఎంపీ అభయ్ కుశ్వాహా అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ డిమాండ్ అర్థరహితమని, రాజకీయ కుట్ర అని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే నిర్వహించిందని గుర్తుచేశారు. తాజా ఫొటోతో ఓటర్ కార్డులను జారీ చేసిన నేపథ్యంలో బురఖాలో వచ్చే మహిళలను కార్డులోని ఫొటోతో సరిపోల్చుకోవాల్సిన అవసరం లేదని అభయ్ కుశ్వాహా వాదించారు.