1983 ప్రపంచ కప్ విజయం హృదయానికి ఎంతో చేరువైనది : కపిల్ దేవ్

సోమవారం, 26 జూన్ 2023 (11:54 IST)
గత 1983 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై విజయం తన హృదయానికి ఎంతో చేరువైందని వరల్డ్ కప్‌లో భారత్ క్రికెట్ జట్టుగా విజేతగా నిలిచిన కెప్టెన్ కపిల్ దేవ్ వెల్లడించాడు. భారత్‌ మొట్టమొదటి సారి ప్రపంచకప్‌ను ముద్దాడి ఆదివారానికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కపిల్‌ చాలా విషయాలు పంచుకున్నాడు. 
 
'ఆ ప్రపంచకప్‌లో ప్రతి విజయమూ ప్రధానమే. కానీ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై గెలుపు నా హృదయానికి చేరువైంది. ఎందుకంటే మాపై విజయాన్ని వాళ్లు హక్కుగా భావించేవాళ్లు. జింబాబ్వేపై నా 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ ఎంతో ముఖ్యమైందని తెలుసు. కెప్టెన్‌గా జట్టుకు ఉపయోగపడే పని చేయాలి. ప్రత్యర్థి బౌలర్లను కాచుకుని క్రీజులో ఉంటే చాలనుకున్నా. 
 
ఆ తర్వాత వేగం పెంచా. ఆ ప్రపంచకప్‌ విజయం తర్వాత దేశంలో క్రికెట్‌ సంస్కృతిలో చాలా మార్పు వచ్చింది. మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. భారత క్రికెట్‌కు అవసరమైన గొప్ప విజయాన్ని ఆ ప్రపంచకప్‌ ఇచ్చింది. అయితే 1985లో ఆస్ట్రేలియాలో గెలిచిన ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను అత్యంత గొప్ప ఘనతగా భావిస్తా. మేం ప్రపంచ ఛాంపియన్లమని చాటిన సందర్భమది' అని కపిల్‌ తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు