అశ్విన్, జడేజాలు క్రికెట్ కెరీర్ గురించి మరచిపోవచ్చు: సెహ్వాగ్

ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (10:52 IST)
భారత స్టార్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమ క్రికెట్ కెరీర్ గురించి మరచిపోవచ్చని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... అశ్విన్, జడేజాలను క్రికెట్ అభిమానులు మరచిపోయేలా కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్‌లు అద్భుత రీతిలో తమ ఫామ్‌ను కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. 
 
స్టార్ బౌలర్లు లేని వేళ, జట్టులో ఏర్పడిన శూన్యాన్ని వీరిద్దరూ భర్తీ చేశారని, ఎప్పుడు వికెట్ కావాలని అనిపించినా, తామున్నామని భరోసాను ఇచ్చేలా వీరి ప్రదర్శన సాగుతోందని, ఇది భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 
 
కోహ్లీ సైతం చాహాల్‌ను పిలిచి మరీ బౌలింగ్‌ను అప్పగిస్తున్నాడని, ఆదివారం జరిగే మ్యాచ్‌లోనే ఇండియా సిరీస్‌ను గెలుచుకుని 3-0 ఆధిక్యంలోకి వెళుతుందని తాను భావిస్తున్నానని అన్నాడు. ఇద్దరు అనుభవజ్ఞులు లేని లోటు తెలియడం లేదన్నారు. 
 
కాగా, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్ లో ఎన్నో ఏళ్ల తరువాత భారత్ తరఫున హ్యాట్రిక్ తీసిన ఘనతను కులదీప్ యాదవ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు