ఇద్దరు సౌతాఫ్రికా క్రికెటర్లకు కరోనా పాజిటివ్.. ఆ స్టాండ్‌కు వెంగ్‌సర్కార్ పేరు

గురువారం, 20 ఆగస్టు 2020 (15:39 IST)
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో ఇద్దరు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, ఆ క్రికెటర్ల పేర్లను మాత్రం క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు బహిర్గతం చేయలేదు. జట్టులోని ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్ పాజిటివ్‌గా రావడంతో వీరిద్దరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి దూరమవుతారని బోర్డు తెలిపింది. 
 
అలాగే, జట్టులోని ఆటగాళ్ళతో పాటు సహాయక సిబ్బందికి ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ అని తేలగా, మిగిలినవారికి నెగెటివ్ అని వచ్చింది. పాజిటివ్‌గా తేలిన ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నారు. 
 
మరోవైపు, ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్ ఇప్పుడు భారత క్రికెట్ మాజీ బ్యాట్స్‌మెన్ , ముంబై జట్టు కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కర్‌ పేరు పెట్టనున్నారు. నార్త్ స్టాండ్‌ను కల్నల్ వెంగ్‌సర్కర్‌ స్టాండ్‌గా నామకరణం చేయాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిర్ణయించింది. 
 
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో.. వాంఖడే స్టేడియం నార్త్ స్టాండ్‍కు దిలీప్ వెంగ్‌సర్కర్‌ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ స్టేడియంలో ఇప్పటికే సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్, సచిన్ టెండూల్కర్ పేరిట స్టాండ్స్ ఉన్నాయి. 
 
దీనిపై వెంగ్‌సర్కార్ స్పందిస్తూ, 'ఇది తనకు చాలా భావోద్వేగ క్షణాలని, గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. వాంఖడే స్టేడియం నా హోమ్ గ్రౌండ్. ఎంసీఏ నా హోమ్ అసోసియేషన్. కాబట్టి ఇది నాకు ప్రత్యేకమైనది. నేను అపెక్స్ కౌన్సిల్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నా దేశం, ముంబై సహచరులు, ఎంసీఏ అనుబంధ క్లబ్‌ల ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు