ఛేజింగ్‌లో జట్టును గెలిపించే ఆటగాళ్ళలో నంబర్ వన్ తోపు ధోనీ!

శనివారం, 19 జనవరి 2019 (11:58 IST)
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో, భారీ విజయలక్ష్యాలను ఛేజింగ్ చేసే సమయాల్లో జట్టులోని ఇతర ఆటగాళ్లతో పోల్చితే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇతర ఆటగాళ్లతో పోల్చితే అత్యంత కీలకమైన ఆటగాడు (తోపు) అని తేలింది. ఈ విషయం తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా మరోమారు నిరూపితమైంది. 
 
ముఖ్యంగా, ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ధోనీ... తొలి మ్యాచ్‌లో 51, రెండో మ్యాచ్‌లో 55 (నాటౌట్), మూడో మ్యాచ్‌లో 87 (నాటౌట్) చొప్పున మొత్తం 193 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. కానీ, చివరి రెండు వన్డేల్లో ధోనీ అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం కారణంగానే గెలిచింది. రెండో వన్డేలో భారీ విజయలక్ష్యాన్ని ఛేదించడంలోనూ, మూడో వన్డేలో అత్యంత క్లిష్టపరిస్థితుల్లో 230 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ధోనీ క్రీజ్‌లో నిలబడి బ్యాటింగ్ చేసిన తీరుపై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
జట్టులోని ఇతర ఆటగాళ్లతో పోల్చితే ఈ సిరీస్‌లో ధోనీ పెద్ద తోపుగా నిలిచాడు. పైగా చివరి రెండు మ్యాచ్‌లలో ధోనీ నాటౌట్‌గా నిలవడంతో సగటు శాతం బాగా పెరిగింది. ఫలితంగా 103.07 సగటుతో ఛేజింగ్‌లో గెలిచిన మ్యాచ్‌లలో ధోనీ నంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు. ఇకపోతే కెప్టెన్ విరాట్ కోహ్లీ 97.88 సగటుతో రెండో స్థానంలో నిలిచాడు. విదేశీ క్రికెటర్ విషయంలో మైకేల్ బెవాన్(86.25), డివిలియర్స్ (82.77), జో రూట్(77.80), క్లార్క్ (73.86) సగటుతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు