అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్

సోమవారం, 30 జనవరి 2023 (16:47 IST)
భారత సీనియర్ బ్యాటర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ సుధీర్ఘ ప్రకటన చేసారు. తనకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐకు, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌, చెన్నై సూపర్ కింగ్స్, చెంప్లాస్ట్ సన్మార్‌‍ కంపెనీ యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత 2002 నుంచి 2018 వరకు సాగిన తన క్రికెట్ ప్రయాణం ఓ అద్భుతమని, తనకు సహకరించిన జట్టు సహచరులు, కోచ్‌లు, మెంటర్లు, సహాయక సిబ్బందిలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. 
 
కాగా టీమిండియాకు రెగ్యులర్ ఓపెనర్‌గా రాణించిన మురళీ విజయ్ గత 2018 సీజన్‌లో సరిగా రాణించలేకపోయాడు. ఫలితంగా జట్టులో స్థానం కోల్పోయాడు. చివరగా 2018లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను ఆడాడు. ప్రస్తుతం క్రికెట్‌లో పోటీ ఎక్కువగా ఉండటంతో పాటు వయసు 38 యేళ్లకు చేరుకోవడంతో ఆయన క్రికెట్‌కు టాటా చెప్పేశాడు. 
 
కాగా, మురళీ విజయ్ తన కెరీర్‌లో 61 మ్యాచ్‌లు ఆడిన 12 సెంచరీలు, 15 అర్థ సెంచరీలు ఉన్నాయి. 38.28 సగటుతో 3,982 పరుగులు చేశాడు. తమిలనాడుకు చెందిన ఈ క్రికెటర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం 106 మ్యాచ్‌లలో 2,619 పరుగులు చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు