తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

ఠాగూర్

ఆదివారం, 27 జులై 2025 (20:55 IST)
గాజాలోని ఉగ్రవాద సంస్థ హమాస్ సంస్థ అధినేత యహ్యా సిన్వర్ భార్య తుర్కియేకు పారిపోయి రెండో వివాహం చేసుకుంది. గాజాలో ఉగ్రవాద సంస్థ హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని, అప్పటివరకు యుద్ధం ఆపేదిలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భీకర ప్రతిజ్ఞ చేశారు. ప్రకటించనట్టుగానే గాజాలోని హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై తీవ్ర స్థాయిలో దాడులు చేశారు. దీంతో హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ సహా కీలక ఉగ్రవాదులు చనిపోయారు. గతేడాది అక్టోబరులో యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ బలగాలు మట్టుబెట్టాయి. అయితే, అంతకుముందే యహ్యా సిన్వర్ భార్య పరారైందని తాజాగా వెల్లడైంది.
 
యహ్యా సిన్వర్ భార్య సమర్ ముహమ్మద్ అబు జమార్ ప్రస్తుతం తుర్కియేలో రహస్యంగా జీవిస్తోందని సమాచారం. సిన్వర్ మరణించడానికి చాలా ముందుగానే సమర్ తన పిల్లలతో కలిసి దొంగ పాస్ పోర్టుతో దేశం దాటినట్లు గాజాలోని హమాస్ వర్గాలు వెల్లడించాయని వై నెట్ మీడియా ఓ కథనంలో పేర్కొంది. 
 
గాజాలోని స్మగ్లింగ్ ముఠా సమర్‌ను రఫా బార్డర్ గుండా ఈజిప్టులోకి చేర్చిందని వై నెట్ పేర్కొంది. సాధారణంగా ఇలా మనుషులను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు స్మగ్లింగ్ ముఠాలు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తాయని, సాధారణ గాజా మహిళకు ఇంత మొత్తం చెల్లించే స్తోమత ఉండదని తెలిపింది.
 
ఈ విషయమే సమర్ పరారైన విషయాన్ని బయటపెట్టిందని వివరించింది. గాజాకు చెందిన ఓ సామాన్య మహిళకు చెందిన పాస్ పోర్ట్‌తో సమర్ తన పిల్లలను తీసుకుని దేశం దాటిందని, తొలుత ఈజిప్ట్ లోకి అక్కడి నుంచి తుర్కియేలోకి ప్రవేశించిందని తెలిపింది. ఆ తర్వాత అక్కడి స్థానికుడిని వివాహం చేసుకుని మారుపేరుతో తుర్కియేలోనే జీవిస్తోందని వై నెట్ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు