జింబాబ్వేతో హరారే మ్యాచ్.. ఎరుపెక్కిన కంటితో ధోనీ ఫోటో.. కూల్ కెప్టెన్‌కు ఏమైంది..?!

గురువారం, 23 జూన్ 2016 (13:27 IST)
భారత్-జింబాబ్వేల మధ్య జరిగిన మూడో ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. బుధవారం హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్‌ చేసింది. 17వ ఓవర్ వద్ద ధోనీకి జింబాబ్వే బౌలర్ డొనాల్డ్ తెరిపానో బౌలింగ్ చేశాడు. ఈ బంతిని భారీ షాట్ చేసే యత్నంలో బంతి బ్యాట్ అంచును తాకుతూ వెళ్ళి వికెట్లకు తగిలింది. 
 
అయితే వికెట్లపై ఉన్న బెయిల్స్‌లో ఒకటి గాల్లోకి ఎగురుకుంటూ వచ్చి ధోనీ కంటికి తాకింది. దీంతో ధోనీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అయినప్పటికీ కొంతసేపటికి నొప్పిని భరించిన ధోనీ.. పెవిలియన్ వైపు నడిచాడు. ఈ క్రమంలో 13 బంతులాడిన ధోనీ 9 పరుగులు సాధించాడు. 
 
తాజాగా కంటికి పెను ప్రమాదం తప్పిందని, కానీ కన్ను ఎరుపెక్కిందని ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎరుపెక్కిన కన్నుతో దిగిన సెల్ఫీ ఒకటి పోస్టు చేశాడు. గాయం వల్ల విజన్‌ కొంత మసకగా ఉందని, నొప్పి కూడా ఉందని ధోనీ చెప్పుకొచ్చాడు. కాగా జింబాబ్వేతో జరిగిన మూడు ట్వంటీ-20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి