'డబుల్' మొనగాడు రోహిత్ : శ్రీలంక టార్గెట్ 393 రన్స్

బుధవారం, 13 డిశెంబరు 2017 (15:06 IST)
ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఘోరంగా విఫలమైన టీమిండియా మోహాలీలో జరుగుతున్న రెండో వన్డేలో జూలు విదిల్చింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ భారీ స్కోరు సాధించింది. తొలి వన్డే మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా భారత క్రికెట్ కుర్రోళ్లు బరిలోకి దిగారు. ఫలితంగా చండీగఢ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు జూలు విదిల్చారు. ఫలితంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. 
 
తొలుత భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన శిఖర్ ధవాన్, రోహిత్ శర్మలు తనదైనశైలిలో బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 21.1 ఓవర్లలో 115 పరుగులు చేశారు. ఈ క్రమంలో తన వ్యక్తిగత స్కోరు 68 వద్ద ధవాన్ ఔటయ్యాడు.
 
ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ‌తో జతకలిసిన శ్రేయాస్ అయ్యర్ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అదేసమయంలో రోహిత్ శర్మ కూడా బ్యాటింగ్‌కు పని చెప్పడంతో తన వన్డే కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ చేశాడు. కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది తొలి డబుల్ సెంచరీ కావడం గమనార్హం. 152 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 12 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో 208 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 
 
మరోవైపు తొలి వన్డే ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ కూడా లంక బౌలర్లను ఊచకోత కోశాడు. 70 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మాజీ కెప్టెన్ ధోనీ క్రీజ్‌లోకి వచ్చి 4 బంతుల్లో ఓ సిక్సర్ సాయంతో 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చివరగా హార్దిక్ పాండ్యా ఐదు బంతుల్లో 8 రన్స్ చేశాడు. అంతకుముదు ఓపెనర్ శిఖర్ ధావన్ 68 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. లంకబౌలర్లలో పెరేరా మూడు వికెట్లు తీయగా, గుణరత్నే ఒక వికెట్ తీశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు