ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ నాయకత్వం ఉందని, ఆయన అనుభవమైన నాయకత్వం రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళుతుందని ఏపీ ఐటీ, విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేశ్... ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలతో సమావేశమై, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని వారిని సాదరంగా ఆహ్వానించారు.
సిడ్నీలోని న్యూసౌత్ వేల్స్ పార్లమెంట్ ప్రాంగణంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ (ఏఐబీసీ) ప్రతినిధులతో జరిగిన రోడ్ షోలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చడానికి తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను, వ్యూహాలను వివరించారు.
ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో చెప్పడానికి తమ వద్ద మూడు బలమైన కారణాలు ఉన్నాయని లోకేశ్ స్పష్టం చేశారు. "మొదటిది, మా రాష్ట్రంలో అనుభవం, దార్శనికత కలిగిన సమర్థవంతమైన నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగోసారి ఈ పదవిని చేపట్టారు. ఆయన 75 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా పనిచేసే యువ నేత, ఉత్సాహవంతుడు. ఈసారి ఎన్నికైన ఎమ్మెల్యేలలో 50 శాతం మంది యువకులే ఉన్నారు. మా మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది కొత్తవారే. మేమంతా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే కసితో, పట్టుదలతో పనిచేస్తున్నాం. ఒకప్పుడు చంద్రబాబు కృషితోనే హైదరాబాద్ నేటి స్థాయికి చేరింది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు మాకు గొప్ప అవకాశం ఇచ్చారు అని లోకేశ్ అన్నారు.
రెండో కారణం... స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్! గతంలో ప్రభుత్వాలు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' గురించి మాట్లాడేవని, కానీ తాము 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ను ఆచరణలో చూపిస్తున్నామని లోకేశ్ అన్నారు. "మా ప్రభుత్వ విధానాలకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. భారత చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అయిన గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది. ఇది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్తో కూడిన గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఈ భారీ ప్రాజెక్టును కేవలం 13 నెలల్లోనే పూర్తిచేశాం. ఇది గూగుల్తో చేసుకున్న ఒప్పందం కంటే కేవలం ఒక నెల మాత్రమే ఎక్కువ. మీరు మాతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు, మన ప్రాజెక్ట్" అని ఆయన వివరించారు.
ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి తాము అనుసరిస్తున్న వాట్సాప్ గ్రూపుల విధానాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. "మేము మొదట ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేస్తాం. నా కార్యాలయంతో పాటు సంబంధిత మంత్రులు, అధికారులు ఇందులో ఉంటారు. ప్రతిరోజూ ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష జరుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి 25 వాట్సాప్ గ్రూపులు నడుస్తున్నాయి. ఏదైనా అప్డేట్ రాకపోతే నేనే స్వయంగా జోక్యం చేసుకుని స్టేటస్ అడుగుతాను.
మా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానం వల్లే గత 16 నెలల్లో రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. కొన్ని సందర్భాల్లో కేవలం మూడు రోజుల్లోనే ఎస్ ఐపీసీ, ఎస్ ఐపీబీ, కేబినెట్ ఆమోదాలు పూర్తిచేసి క్లియరెన్సులు ఇచ్చాం అని లోకేశ్ తెలిపారు. విశాఖలో ఆర్సెల్లర్ మిట్టల్ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టును 15 నెలల్లో పూర్తిచేయడం తమ వేగానికి మరో నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
మూడో కారణం, ఆంధ్రప్రదేశ్ ఒక 'స్టార్టప్ స్టేట్' అని లోకేశ్ అభివర్ణించారు. పెట్టుబడుల కోసం మేము ఆకలితో ఉన్నాం. పనులను వేగంగా పూర్తిచేయాలనే తపన మాకుంది. మాది జాతీయ దృక్పథం కలిగిన ప్రాంతీయ పార్టీ. రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే భారత్ గెలుస్తుంది. ఇది న్యూ ఇండియా. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన వంతు పాత్ర పోషిస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.