ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కోహ్లీకి విశ్రాంతి అవసరమా?

శనివారం, 15 సెప్టెంబరు 2018 (16:08 IST)
ఆసియా కప్ వన్డే టోర్నమెంట్‌ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంపై భారత మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ మండిపడ్డారు. కోహ్లీకి ప్రస్తుతం విశ్రాంతి ఇవ్వడం అవసరమా అంటూ ప్రస్తుత సెలక్టర్లను ప్రశ్నించారు. విరాట్ ఆసియా టోర్నీ నుంచి తప్పుకునే బదులు.. అక్టోబర్‌లో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ నుంచి తప్పుకొని నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు విశ్రాంతి తీసుకుంటే బాగుండేదని పాటిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకమనే విషయాన్ని సందీప్ పాటిల్ గుర్తు చేశారు. మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. వ‌చ్చే బుధవారం భారత్-పాకిస్థాన్‌ల మధ్య హోరాహోరీగా పోరు జరుగనుంది.
 
ఈ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లపై ఒత్తిడిని తాను అర్థం చేసుకోగలనని పాటిల్ వెల్లడించారు. భారత్-పాక్ పోరు అంటే క్రికెట్ ప్రేమికులు ఎంతో భావోద్వేగంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు సిద్ధమవుతారు. అలాంటి మహాపోరులో కోహ్లీ అందుబాటులో లేకపోవడాన్ని ఊహించలేకపోతున్నా. ఏ సిరీస్‌కు, ఏ టోర్నమెంట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే విషయంపై ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలక్షన్ ప్యానెల్ కసరత్తు చేయాలని పాటిల్ వ్యాఖ్యానించారు. 
 
వెస్టిండీస్‌తో సిరీస్ కన్నా.. ఆసియా కప్‌లో విజయం సాధించడమే ముఖ్యమని చెప్పారు. అంతగా అనుభవంలేని రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారని.. అతడిపై పెద్ద భారమే ఉందని వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు