విడిపోయిన శిఖర్ - అయేషా దంపతులు.... 9 యేళ్లకే ముగిసిన ప్రేమ పెళ్లి

బుధవారం, 8 సెప్టెంబరు 2021 (07:54 IST)
భారత క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ -అయేషా ముఖర్జీ దంపతులు విడిపోయారు. తొమ్మిదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఓ బిడ్డ ఉంది. వీరిద్దరూ ఇపుడు విడిపోయారు. దీంతో ఈ జంట ప్రేమ పెళ్లి 9 ఏళ్లకే ముగిసింది. తామిద్దరం విడిపోతున్నట్టు అయేషా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించి అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 
 
మెల్‌బోర్న్ బాక్సర్ అయిన అయేషాకు ధావన్‌తో వివాహానికి ముందే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత మొదటి వివాహానికి స్వస్తి చెప్పిన అయేషా ధావన్‌తో ప్రేమలో పడింది. 2012లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు (జొరావర్) కూడా ఉన్నాడు.
 
తాజాగా, తామిద్దరం విడిపోతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన అయేషా..  వివాహం, విడాకులు అనే పదాలు చాలా శక్తిమంతమైవని పేర్కొంది. తొలిసారి విడాకులు తీసుకుంటున్నప్పుడు తాను చాలా భయపడ్డానని, జీవితంలో ఓడిపోయినట్టు, తప్పు చేస్తున్న భావన తనను పట్టి పీడించేవని పేర్కొంది.
 
రెండోసారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదమే తనకు చాలా చెత్తగా అనిపించేదని తెలిపింది. తల్లిదండ్రులను, పిల్లలను చాలా నిరాశకు గురిచేశానని భావించానని, ఇప్పుడు రెండోసారి విడాకుల ఊహే భయంకరంగా ఉందని వివరించింది. అయితే, ఈ విడాకుల విషయమై శిఖర్ ధావన్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు