ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్

ఠాగూర్

ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (12:23 IST)
ఆసియా కప్ 2025 జట్టులో చోటు దక్కక తీవ్ర నిరాశలో ఉన్న భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ అనూహ్యంగా కీలక బాధ్యతలు అప్పగించింది. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే సిరీస్ కోసం ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా అతడిని నియమించింది. ఈ నిర్ణయం ఒకవైపు అయ్యర్ కెరీర్‌కు కొత్త ఊపునిస్తుండగా, మరోవైపు సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా చేసింది. 
 
ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్ వంటి యువ ఆటగాళ్లకు చోటు కల్పించిన సెలక్టర్లు, కరుణ్ నాయర్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. గతంలో ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అభిమన్యు ఈశ్వరనన్ను కాదని, అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం వెనుక ఖచ్చితమైన వ్యూహం ఉన్నట్లు క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయ్యర్‌ను మళ్లీ టెస్టు జట్టులోకి తీసుకురావడానికే సెలక్టర్లు ఈ మార్గాన్ని ఎంచుకుని వుంటారంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
ఈ పరిణామంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెన్‌లో స్పందిస్తూ, "సెలక్టర్లు కరుణ్ నాయర్‌ను పూర్తిగా పక్కనపెట్టినట్లు కనిపిస్తోంది. అతనికి రెండో అవకాశం ఇచ్చినా, ఇంగ్లండ్ పర్యటనలో ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. అందుకే సెలక్టర్లు అతనిని దాటి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లున్నారు" అని చోప్రా విశ్లేషించాడు.
 
శ్రేయస్ అయ్యర్ నియామకాన్ని ఆసక్తికరమైన పరిణామంగా అభివర్ణించిన చోప్రా, ఇది అతని టెస్టు కెరీర్‌కు మళ్లీ తలుపులు తెరిచినట్లేనని అన్నాడు. "ఆసియా కప్‌కు ఎంపిక కానప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అతనే ఇండియా-ఏ కెప్టెన్. దీన్నిబట్టి చూస్తే, రాబోయే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో అయ్యర్ టెస్టు జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. భారత పిచ్‌లపై అయ్యర్ రాణించగలడని, ఈ ఎంపిక అతడికి మార్గం సుగమమైంది" అని చోప్రా అంచనా వేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు