క్రికెట్‌కు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ వీడ్కోలు

మంగళవారం, 28 జనవరి 2020 (15:36 IST)
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ వెర్నన్ ఫిలాండర్ అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు ముగిసిన అంనతరం అతను క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం వీడ్కోలు పలుకుతానని అతను గతంలోనే ప్రకటించాడు. 
 
దక్షిణాఫ్రికా తరపున అతను 64 టెస్టులు, 30 వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు. టెస్టుల్లో 224 వికెట్లు, వన్డేల్లో 41, టీ20 ఫార్మాట్లో నాలుగు వికెట్లు తీశాడు. డేల్ స్టెయిన్, మోర్నీ మార్కెల్‌తోపాటు దక్షిణాఫ్రికా పేస్ విభాగంలో కీలక బౌలర్‌గా సేవలు అందించాడు. తొలి ఏడు టెస్టుల్లోనే 51 వికెట్లు తీసి సత్తా చాటిన ఘనత ఫిలాండర్‌కే దక్కుతుంది. 
 
అయితే ఆఖరి టెస్టు మ్యాచ్ ఫిలాండర్‌కు పెద్దగా కలిసిరాలేదు. జట్టును గెలిపించి వీడ్కోలు పలకాలని అతను అనుకున్నప్పటికీ.. ఆ కల నెరవేరలేదు. అంతేకాకుండా ఐసీసీ తన మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక అయోగ్యత పాయింటను ఇచ్చింది. 
 
నాలుగో టెస్టు రెండో రోజు జోస్ బట్లర్‌ను ఔట్ చేసిన అనంతరం అతడు హద్దు మీరి ప్రవర్తించినందుకు ఐసీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కాగా, ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఓటమి తర్వాత ఫిలాండర్ మాట్లాడుతూ, ఆ విధంగా తాను కెరీర్‌ను ముగించాలని అనుకోలేదని, అది మానవుడి చేతిలో లేదని, ఇంగ్లాండు అద్భుతంగా ఆడిందని, తాము తీవ్రంగా శ్రమించామని, దక్షిణాఫ్రికా తరఫున ఆడేందుకు అవకాశం రావడం తనకు గౌరవమని అన్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు