నన్నే కాదు.. సెహ్వాగ్, జహీర్‌లను కూడా పిలిచి మాట్లాడలేదు.. యువీ (Video)

శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:16 IST)
టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ తన కెరిర్‌లోనే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. 19 సెప్టెంబరు 2007న తొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో ఆరు బంతులనూ స్టాండ్స్‌లోకి పంపి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన యువీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేశాడు.
 
అలాంటి వ్యక్తికి సొంత జట్టులోనే అన్యాయం జరిగిందా అంటే అవుననే చెప్పాలి. యో-యో టెస్టు పూర్తి చేసినా యువరాజ్ సింగ్‌కు జట్టులో అవకాశం కల్పించలేదు. టీమిండియాలో ఇలా జరగడంపై యువీ ఆవేదన వ్యక్తం చేశాడు. టీమిండియా యో-యో టెస్టును ప్రామాణికంగా పెట్టింది. ఆటగాళ్లు అందరూ యో-యో టెస్టులో నెగ్గితేనే జట్టులోకి వస్తారు. కానీ యో-యోలో గెలిచినా యువీని పక్కబెట్టారు.
 
ప్రస్తుతం ఈ వ్యవహారంపై యువీ ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా యువీ మాట్లాడుతూ.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తాను ఆడిన 8-9 మ్యాచ్‌ల్లో రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనా.. జట్టు నుంచి తనను తప్పిస్తారని అస్సలు ఊహించలేదన్నాడు. 36 ఏళ్ల వయసులో యో-యో టెస్టులో పాస్ అవుతానని జట్టు యాజమాన్యం భావించలేదు. 
 
యోయో టెస్టు పూర్తిచేసినా జట్టులో తనకు అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. 15-17 సంవత్సరాలుగా భారత జట్టు కోసం ఆడిన క్రికెటర్‌ను గౌరవార్థం కూడా పిలిచి మాట్లాడకపోవడం.. జట్టు నుంచి తొలగించడం దురదృష్టకరమని యువీ అన్నాడు.
 
తనతో మాత్రమే కాదు.. యువకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయాన్ని సీనియర్‌ క్రికెటర్లు సెహ్వాగ్‌, జహీర్‌ వద్ద కూడా ప్రస్తావించలేదన్నాడు. విదేశీ క్రికెట్ సిరీస్‌ల్లో ఆడాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ప్రకటించానని యువీ అన్నాడు. తన వరకైతే తాను సరైన టైమ్‌లో రిటైర్మెంట్ ప్రకటించానని యువీ వ్యాఖ్యానించాడు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు