నా అభిమాన సారథి అతనే.. విరాట్ కోహ్లీ మనసులోని మాట

ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (13:44 IST)
తన అభిమాన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే అని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. పైగా, తనపై  ఒక విఫల కెప్టెన్‌గా ముద్ర వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాను ఆ కోణంలో తనను తాను అంచనా వేసుకోలేదని చెప్పారు. పలు టోర్నీల్లో భారత జట్టు సెమీ ఫైనల్, ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ వాటిని ప్రజలు జట్టు వైఫల్యాలుగానే చూశారన్నారు. 
 
ముఖ్యంగా, కోహ్లీ సారథ్యంలో 2017లో చాంపియన్ ట్రోఫీ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరింది. 2019లో జట్టు ప్రపంచ కప్‌లో సెమీస్‌కు వెళ్లింది. 2021లో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిఫ్ పోటీల్లో తలపడింది. కానీ, గత టీ20 వరల్డ్ కప్‌లో గ్రూపు దశలోనే భారత్ ఇంటిదారిపట్టింది. 
 
"ఈ నాలుగు టోర్నీల తర్వాత భారత కెప్టెన్‌గా నేను విఫలమయ్యాననే ముద్ర వేశారు. అయితే ఆ కోణంలో నన్ను నేను ఎపుడూ అంచనా వేసుకోలేదు. భారత జట్టు సంస్కృతిలో మార్పు తీసుకొచ్చా. అందుకు నేను గర్విస్తున్నా.. ఒక జట్టుగా మేం ఏం సాధించామో, మా మాటతీరులో వచ్చిన మార్పులేంటో అందరూ చూశారు.
 
సాధారణంగా మెగా టోర్నీలు ఓ సమయానికి మాత్రమే పరిమితమవుతాయి. కానీ జట్టు ఆటలో మార్పుల తెచ్చి, జట్టు సంస్కృతిని మార్చడం అనేది ఓ సుధీర్ఘ ప్రక్రియ. అది జరగాలంటే సమిష్టి కృషి అవసరం. ఒక ఆటగాడిగా నేను వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ గెలిచా" అని చెప్పారు. 
 
అదేసమయంలో 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో తాను ఉండటం తన అదృష్టమమని చెప్పారు. సచిన్ టెండూల్కర్ తన ఆరో ప్రయత్నంలో ప్రపంచ కప్ నెగ్గారని, కానీ, తాను ఆడిన తొలి ప్రపంచ కప్‌లోనే భారత్ విజేతగా నిలవడం తన అదృష్టమని కోహ్లీ చెప్పారు. తన అభిమాన కెప్టెన్ ధోనీనేనని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు