ఐపీఎల్ ఫైనల్‌కు జోహెన్స్‌బర్గ్ వేదిక

ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ టోర్నీకి ఫైనల్ వేదికగా దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌ను ఎంపిక చేశారు. ఏప్రిల్ 18వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రారంభ మ్యాచ్‌కు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానం ఆతిథ్యం ఇస్తుంది. ప్రారంభ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుంది. రెండో మ్యాచ్‌గా తొలి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన చెన్నయ్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడతాయి.

ఈ టోర్నీలో జరిగే మొత్తం 59 మ్యాచ్‌లను ఎనిమిది నగరాల్లో నిర్వహిస్తారు. కేప్‌టౌన్, జోహెన్స్‌బర్గ్, డర్బన్, ప్రీటోరియా, ఈస్ట్ లండన్, కింబెర్లీ, బ్లూం‌ఫోంటైన్, పోర్ట్ ఎలిజబెత్‌లు ఆతిథ్యం ఇస్తాయి. డర్బన్‌లోని కింగ్స్‌మెడ్ స్టేడియంలో 16 మ్యాచ్‌లు జరుగుతాయి. సెంచూరియన్ పార్క్‌ మైదానం 12 మ్యాచ్‌లకు, జోహెన్స్‌బర్గ్, న్యూలాండ్ స్టేడియాలు ఎనిమిది మ్యాచ్‌లు చొప్పున జరుగుతాయి.

పోర్ట్ ఎలిజబెత్, బఫెలో పార్క్‌ స్టేడియాల్లో ఏడు, నాలుగు మ్యాచ్‌ల చొప్పున, ఓవల్, కింబెర్లీ మైదానంలో రెండు చొప్పున మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మ్యాచ్‌లన్ని భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతాయి.

వెబ్దునియా పై చదవండి