వెస్టిండీస్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్లో ఆడే శ్రీలంక జట్టును ఆ దేశ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. ఇందులో 40 ఏళ్ల స్టార్ క్రికెటర్ సనత్ జయసూర్యకు సెలక్టర్లు స్థానం కల్పించారు.
15 సభ్యులతో కూడిన ఈ జట్టులో జయసూర్యకు స్థానం కల్పించడంతో సెలక్టర్లు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. యువ క్రికెటర్లకు అవకాశాలిస్తారని అనుకున్న క్రికెట్ అభిమానులకు సెలక్షన్ కమిటీ సభ్యులు షాక్ ఇచ్చారు. కానీ డిసెంబరులో భారత్తో జరిగిన అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్లో జయసూర్య గట్టిపోటీని ప్రదర్శించడంతోనే అతనికి సెలక్టర్లు జట్టులో స్థానం కల్పించినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి.
కరేబియన్ గడ్డపై ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్లో ఆడే లంక జట్టులో ఇంకా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేష్ చందిమల్, ఆల్-రౌండర్ తుషారా బొపరాలకు కూడా స్థానం దక్కింది.