న్యూజిలాండ్, టీం ఇండియాల మధ్య గురువారం ప్రారంభం కాబోతున్న రెండో టెస్ట్కు వేదికగా ఉన్న మెక్లీన్ పార్క్ వికెట్పై వ్యక్తం అవుతున్న ఆందోళనను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్జెడ్సీ) తోసిపుచ్చింది. రెండో టెస్ట్కు ఉపయోగిస్తున్న మెక్లీన్ పార్క్ వికెట్ అద్బుతంగా ఉందని భరోసా ఇచ్చింది.
ఈ వికెట్కు పంగస్ సోకినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిచ్కు ఇటువంటి వ్యాధి సోకలేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. టెస్ట్ మ్యాచ్ జరగబోతున్న పిచ్కు ఎటువంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దెబ్బతిన్నట్లు చెబుతున్న స్ట్రిప్ కాకుండా ఈ మ్యాచ్కు కొత్త స్ట్రిప్ తయారు చేయడం జరిగిందని తెలిపింది.
కొత్త పిచ్ ధృడంగా, ప్లాట్గా ఉంటుందని వివరించింది. దెబ్బతిన్న భాగం ఆడే ప్రదేశానికి బయటవైపు ఉంది. ఆ భాగం కూడా వ్యాధి వలన దెబ్బతినలేదు. అయినా గత పది రోజులుగా శ్రమించి కొత్త స్ట్రిప్ తయారు చేశాము. కొత్త స్ట్రిప్ అద్బుతంగా ఉందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ కోచ్ ఆండీ మోల్స్ రెండో టెస్ట్ జరుగుతున్న నేపియర్ పిచ్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సీమ్ ట్రాక్ కాకపోవడం ఆయన అసంతప్తి చెందేందుకు కారణం అయింది.