వార్న్ సేన వరుస విజయాలకు డేర్డెవిల్స్ బ్రేక్..!!
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న వార్న్ సేన రాజస్థాన్ రాయల్స్కు ఢిల్లీ డేర్డెవిల్స్ అడ్డుకట్ట వేసింది. న్యూఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్లో గౌతం గంభీర్ సేన 67 పరుగుల తేడాతో రాజస్థాన్పై ఘన విజయం సాధించింది.
ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్-వార్నర్లు ఇన్నింగ్స్ను ప్రారంభించారు. తొలి ఓవర్లోని యూసుఫ్ పఠాన్ బౌలింగ్లో సెహ్వాగ్ ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. అయితే ఒకే ఓవర్లో నార్వెల్ వార్నర్ 4, సెహ్వాగ్ 19 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కాలింగ్ ఉడ్ సిక్సర్తో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే కాసేపటికే 16 పరుగులవద్ద రనౌట్గా వెనుదిరిగాడు. ఆపై జాదవ్ 10 పరుగుల వద్ద పెవిలియన్ చేరటంతో ఢిల్లీ 67 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిపోయింది.
అనంతరం బరిలో దిగిన దినేష్ కార్తీక్ కెప్టెన్ గంభీర్ సహాయంతో మెరుపులు మెరిపించాడు. గంభీర్ రన్రేట్ తగ్గకుండా ఆచితూచి ఆడుతుంటే, కార్తీక్ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో అలరించాడు. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్కు 79 పరుగులు జోడించిన అనంతరం గౌతం గంభీర్ 43 పరుగులవద్ద భారీ షాట్ కోసం ప్రయత్నించి వెనుదిరిగాడు. తరువాత వచ్చిన మెక్డొనాల్డ్ (14) సాయంతో కార్తీక్ జోరు కొనసాగించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది.
ఢిల్లీ విధించిన భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే సాధించి ఆలౌట్ అయ్యింది. రాయల్స్ బ్యాట్స్మెన్లలో యూసుఫ్ పఠాన్ 24, ఓజా 27 పరుగులు మినహా తక్కినవాళ్లెవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఇక ఢిల్లీ బౌలర్లలో మిశ్రా మూడు వికెట్లు పడగొట్టగా, డేవిడ్ వార్నర్ నాలుగు క్యాచ్లను పట్టుకుని ప్రేక్షకులను అలరించాడు.