ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఒత్తిడి లోనవుతుందని, అందుకే ప్రత్యర్థి జట్టుపై ధీటుగా రాణించలేకపోతుందని వస్తున్న విమర్శలను ఆ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ కొట్టి పారేశాడు.
జట్టు ప్రదర్శనతో పాటు వ్యక్తిగత ఆటతీరుపై వెలువెత్తే విమర్శలను తాను ఏ మాత్రం పట్టించుకోనని గంగూలీ స్పష్టం చేశాడు. ఇంకా తన ఆటతీరుపై పూర్తి నమ్మకంతో ముందుకెళతానని అన్నాడు.
ఇప్పటివరకు ఆడిన 8 ఐపీఎల్ మ్యాచ్లో నాలుగింటిలో పరాజయం పాలవడానికి జట్టు ఒత్తిడికి గురికావడం ప్రధాన కారణం కాదని గంగూలీ చెప్పాడు. అలాగే తదుపరి మ్యాచ్ల్లో రాణించేందుకు తమ జట్టు సాయశక్తులా ప్రయత్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇంకా గంగూలీ మాట్లాడుతూ.. తాను విమర్శలను పట్టించుకుంటూ జీవితాన్ని గడిపేసే రకం కాదని, క్రికెట్లో నిలదొక్కుకుని ఆడాలనే నమ్మకంతో ఉంటానని చెప్పాడు. సాధారణంగా క్రికెటర్లు క్రీజులో ఒత్తిడికి గురికావడం సహజమేనని బెంగాల్ దాదా అన్నాడు.
ఇందుకు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. ప్రపంచ రికార్డులు సృష్టిస్తోన్న సచిన్ టెండూల్కరే నిదర్శనమని గంగూలీ అన్నాడు. ఒత్తిడిని చాకచక్యంగా ఎదుర్కొంటూనే.. క్రీజులో ధీటుగా రాణించే సచిన్ టెండూల్కర్ ఆటతీరు అందరికీ మార్గదర్శకమని దాదా ఎత్తి చూపాడు.
అందుచేత విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని సౌరవ్ తెలిపాడు. ఇంకా తాను క్రికెట్ కెరీర్లో రాణించాలంటే.. ఇలాంటి విమర్శలను పట్టించుకోకపోవడమే మంచిదని దాదా తెలిపాడు.
ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో.. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ (54 బంతుల్లో 88 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగి ఆడాడు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్తో తలపడిన కోల్కతా నైట్రైడర్స్ 24 పరుగుల తేఢాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.