బీసీసీఐ నిర్ణయంపై మిల్స్ ఆగ్రహం

టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వికెట్‌ కీపర్ కం బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌లను ఎన్‌జెడ్‌పీసీఏ-ఏసీఏ మాస్టర్స్ ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అనుమతించకపోవడంపై న్యూజిలాండ్ క్రికెట్ సంఘం చీఫ్ హీత్ మిల్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఆడుతున్న హిమేష్ మార్షల్ ఉన్నందున సచిన్, దినేశ్ కార్తీక్‌లను ల్గొనరాదంటూ.. బీసీసీఐ ప్రకటించిన సంగతి విదితమే. దీనికి ప్రతిస్పందనగా కివీస్ క్రికెటర్ల సంఘం సీఈవో మిల్స్ మాట్లాడుతూ.. సచిన్, దినేశ్‌లను ఈ మ్యాచ్‌లోకి ఆడేందుకు అనుమతించకుండా బీసీసీఐ మూర్ఖంగా వ్యవహరిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

టీం ఇండియా ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ఆడతారని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు సంతోషంగా ఉన్న సమయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తమను ఆశ్చర్యపరచిందనీ మిల్స్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో ఆడుతున్నవారిలో అండర్-19 క్రికెటర్లు కూడా ఉన్నారనీ, అటువంటి ఆటగాళ్లు సచిన్ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్‌‍కు బౌలింగ్ చేసే అవకాశాన్ని గొప్పగా భావిస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం వారందరినీ తీవ్రంగా నిరాశపరచిందని మిల్స్ వాపోయాడు.

వెబ్దునియా పై చదవండి