ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో టాప్లో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుపై రెండోసారి ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది. స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్ సచిన్ టెండూల్కర్తో పాటు, జట్టు సభ్యులపై కూడా జరిమానా చెల్లించాలని ఐపీఎల్ పేర్కొంది. దీంతో సచిన్ టెండూల్కర్ 40,000 డాలర్లు, జట్టు సభ్యులు 10,000 డాలర్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ముంబైలో మంగళవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన 27వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలోనే మ్యాచ్ను పూర్తి చేయలేకపోయింది. ఇంకా ఒక ఓవర్ సమయాన్ని అదనంగా ఆడటంతో సచిన్ సేనపై ఐపీఎల్ యాజమాన్యం భారీ జరిమానాను విధించింది.
ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్, నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ (ఏడు మ్యాచ్ల విజయాలు, 12 పాయింట్లతో) ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ.. సెమీస్కు చేరువలో ఉంది.