పెర్త్ టెస్టు గణాంకాల హైలెట్స్

ఆదివారం, 20 జనవరి 2008 (12:01 IST)
క్రికెట్ ప్రపంచంలో తామే "విశ్వ విజేత"లమంటూ వినీనాలాకాశంలో విహరిస్తున్న 'కంగారుల' మెడలు వంచి నేలకు దింపిన ఆటగాళ్లుగా 'టీమ్ ఇండియా' చరిత్ర సృష్టించారు. 16 వరుస అప్రహతిక విజయాలతో కొనసాగుతూ 17వ విజయంపై కన్నేసిన ఆసీస్‌ను ఖంగుతినిపించిన భారత జట్టు.. పెర్త్ మైదానంలో తొలి విజయాన్ని రుచి చూడటమే కాకుండా, వాకా (పెర్త్) మైదానంలో ఓటమి ఎరుగని జట్టుగా వున్న ఆతిధ్య జట్టు ఖాతాలో తొలి పరాజయన్ని నమోదు చేయించింది. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై కెప్టెన్ రికీ పాంటింగ్‌కు తొలి ఓటమి కాగా, మొత్తం మీద నాలుగో ఓటమి కావడం గమనార్హం. క్రికెట్ ప్రపంచ దృష్టినే మరల్చిన పెర్త్ టెస్టులోని హైలెట్స్‌ను ఒకసారి పరిశీలిస్తే...

* పెర్త్‌ మైదానంలో భారత్ ఆడిన మూడు టెస్టు మ్యాచ్‌లలో భారత్‌కు దక్కిన తొలి విజయం. ఆస్ట్రేలియా ఆడిన 35 టెస్టుల్లో ఎనిమిదో పరాజయం.
* పెర్త్‌లోని వాకా మైదానంలో గెలుపొంది తొలి ఉపఖండపు జట్టు భారత్. శ్రీలంక రెండు టెస్టులు, పాకిస్తాన్ నాలుగు టెస్టులు ఆడి పరాజయాన్ని చవిచూశాయి.
* కెప్టెన్‌గా అనిల్ కుంబ్లేకు తొలి విదేశీ విజయం.
* పెర్త్ మైదానంలో మూడు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియాకు ఎదురైన తొలి ఓటమి.
* 17వ వరుస విజయంపై కన్నేసిన కంగారులకు బ్రేక్ వేయడమే కాకుండా... సొంత గడ్డపై 26వ వరుస విజయానికి భారత్ చెక్ పెట్టింది.

* ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు స్వదేశంలో ఎదురైన తొలి టెస్టు ఓటమి కాగా, మొత్తం మీద నాలుగోది.
* మూడో టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో పాంటింగ్‌ను ఇషాంత్ శర్మ అవుట్ చేశాడు.
* 18వ టెస్టు ఆడుతున్న ఆండ్రూ సైమండ్స్ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఆరు అర్థ శతకాలు వున్నాయి.
* భారత బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ నాలుగో సారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఇది మొదటిది.
* ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియా-భారత్‌లు 35 టెస్టుల్లో తలపడగా, భారత్‌ ఐదింటింలో విజయం సాధించింది. 22 టెస్టులో ఓడిపోగా, ఎనిమిది టెస్టులు డ్రాగా ముగిశాయి.

వెబ్దునియా పై చదవండి