బెంగుళూరు మహానగరంలో మరో టెక్కీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భార్య వేధిస్తుందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. బెంగుళూరు రాజ్భవన్ వెలుపల ఈ ఘటన జరిగింది. హెబ్బాల్ ప్రాంతానికి చెందిన జుహైల్ అహ్మద్ (36) అనే టెక్కీ ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జుహైల్ అహ్మద్ అనే వ్యక్తి రాజ్భవన్ గేటు వద్దకు చేరుకుని తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను శరీరంపై పోసుకున్నాడు. తన భార్య తనపై గృహహింస కేసు పెట్టిందని, తాను కూడా ఆమెపై ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోవడం లదేని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. నా ఫిర్యాదు కూడా తీసుకోవాలని కోరినా పోలీసులు వినడం లేదు. ఇపుడు నాకు చావే శరణ్యం అని కేకలు వేస్తూ నిప్పంటించుకునేందుకు సిద్ధమయ్యాడు.
అయితే, అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. ఆపై అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు జుహైల్ అహ్మద్ను అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత విచారణ నిమిత్తం సమీపంలోని ఠాణాకు తరలించారు.
జుహైల్ అహ్మద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు పోలీసులు వెల్లడించారు. కొంతకాలంగా కుటుంబ కలహాలు, భార్యతో న్యాయపరమైన వివాదాల కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. భార్యాభర్తల మధ్య వివాదాలు, అహ్మద్ చేసిన ఆరోపణలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.