చైనా లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు - ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

గురువారం, 13 జులై 2023 (14:58 IST)
చైనా లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులకు మరొకరు బలయ్యారు. ఆ యాప్ ఏజెంట్ల వేధింపులను భరించలేక ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 22 ఏళ్ల తేజస్ రుణాలిచ్చే చైనా యాప్ ద్వారా కొంత మొత్తం తీసుకున్నాడు. తిరిగి చెల్లించే విషయంలో విఫలం కావడంతో యాప్ ఏజెంట్లు వేధింపులకు దిగారు. డబ్బులు తిరిగి చెల్లించకుంటే బాధితుడి ఫోనులో ఉన్న ప్రైవేటు ఫొటోలను బయటపెడతామని బెదిరించారు.
 
వేధింపులు రోజురోజుకు మితిమీరుతుండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన తేజస్ జలహళ్లిలోని తన ఇంటిలోనే ఉరేసుకున్నాడు. తేజస్ యలహంకలోని నిట్టె మీనాక్షి కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. 'స్లైస్ అండ్ కిస్' అనే చైనా యాప్ నుంచి తేజస్ కొంత మొత్తం రుణం తీసుకున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. 
 
ఈ విషయం తెలిసిన తేజస్ తండ్రి గోపీనాథ్ ఆ డబ్బులను విడతల వారీగా చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చారు. తేజ ఆత్మహత్యకు మూడు రోజుల ముందు రుణ చెల్లింపునకు మరికొంత సమయం కావాలని ఏజెంట్లను గోపీనాథ్ అభ్యర్థించినా వారు ససేమిరా అన్నారు. వారు ఆయన ఇంటికి వెళ్లి మరీ బెదిరించినట్టు తెలుస్తోంది. 
 
ఈ క్రమంలో మంగళవారం యాప్ ఏజెంట్ తేజస్‌కు పలుమార్లు ఫోన్లు చేశారు. దీంతో తేజస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు అతడు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు మరోమార్గం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని, తనను క్షమించాలని ఆ లేఖలో వేడుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు