జట్టు కత్తిరించుకోమన్న అధ్యాపకుడు - భవనంపై నుంచి దూకిన విద్యార్థి!!

ఠాగూర్

గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:56 IST)
సహచర విద్యార్థుల ముందు.. వెంట్రుకలకు కత్తిరించుకోవాలని ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి అధ్యాపకుడు సూచించారు. దీన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏకంగా భవనంపై నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చందాపూర్ గ్రామానికి చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్ (19) అనే యువకుడు ఘట్కేసర్‌ మండలం, వెంకటాపూరులోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో సీఎస్ఈ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ విద్యార్థి కొన్ని రోజులుగా తరగతులకు ఆలస్యంగా రావడంతో పాటు నాలుగు రోజుల క్రితం వచ్చిన మొదటి సెమి పరీక్షల ఫలితాల్లో అన్నింటా ఫెయిల్ అయ్యాడు.
 
దీంతో మూడు రోజుల నుంచి అధ్యాపకుడు(డీన్) వీఎస్ రావు విద్యార్థికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కటింగ్ చేయించుకోవాలని సూచించారు. బుధవారం కూడా ఇదే విషయం చెప్పాడు. తోటి విద్యార్థుల ముందు అధ్యాపకుడు మందలించాడని అవమానంగా భావించిన జ్ఞానేశ్వర్ రెడ్డి మధ్యాహ్నం వర్సిటీ భవనం రెండో అంతస్తు నుంచి దూకాడు. వెంటనే అధ్యాపకులు విశ్వవిద్యాలయంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
 
అధ్యాపకుడు అవమానించడంతోనే ఆత్మహత్యాయత్నం చేశాడని విద్యార్థి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జ్ఞానేశ్వర్ రెడ్డి తరగతులకు సరిగా రావడంలేదు. మొదటి సెమ్‌లో ఫెయిలయ్యాడని, జుట్టు పెరడగడంతో కటింగ్ చేయించుకోవాలని కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చానని అధ్యాపకుడు వీఎస్ రావు మీడియాతో చెప్పారు. ఇదే విషయాన్ని విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు