బాబాయ్‌తో కలిసి నటించాలన్న కోరిక ఉంది.. కానీ మంచి కథ కుదరాలి : వరుణ్ తేజ్

ఠాగూర్

బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (13:07 IST)
తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలన్న కోరిక ఉందని, కానీ, తమకిద్దరికి సూటయ్యే కథ కుదరాలని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇందులో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ కథానాయికగా నటించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. భారత వాయుసేన నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. మార్చి ఒకటో తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ వాలంటైన్ చిత్రం బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. 
 
ఈ క్రమంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని మల్లారెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలని ఎవరికి మాత్రం ఉండదన్నారు. కానీ, తామిద్దరం కలిసి నటించాలంటే సరైన కథ కుదరాలి కదా అని అన్నారు. కథ దొరికితే బాబాయ్‌తో సినిమా చేస్తాను అని తెలిపారు. వాయుసేన నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి చిత్రం ఇదేనని తెలిపారు. కామెడీ సినిమాలు వంద చేసినా దేశం కోసం చేసిన సినిమా ఎంతో గొప్పగా ఉంటుందని వరుణ్ చెప్పారు. 
 
ఇకపోతే, ఇటీవల ఓ ఇంటివాడైన వరుణ్ తేజ్ తన అర్థాంగి లావణ్య త్రిపాఠి పేరును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీ అభిమాన హీరోయిన్ ఎవరని ప్రశ్నించగా, నా అభిమాన హీరోయిన్‌నే తాను పెళ్లి చేసుకున్నానంటూ చమత్కరించారు. లావణ్య తర్వాత తాను ఎక్కువగా అభిమానించే హీరోయిన్ సాయిపల్లవి అని చెప్పారు. మంచి కథలు దొరికితే లావణ్య, తాను కలిసి నటిస్తామని వరుణ్ తేజ్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు