తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఒక అమానవీయ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకడు సభ్యసమాజం తలదించుకునే పాడపనికి పాల్పడ్డాడు. ఓ మహిళతో సహజీవనం చేస్తూనే.. ఆ మహిళకు చెందిన ఇద్దరు కుమార్తెలపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆరేళ్లుగా ఈ తంతు కొనసాగించాడు. ఈ క్రమంలో ఆ టీచర్ అనారోగ్యానికి గురికావడంతో వివిధ రకాలైన రక్తపరీక్షలు చేయగా, ఇందులో హెచ్.ఐ.వి సోకినట్టుు తేలింది. అదేసమయంలో బాలికలిద్దరు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని తల్లికి చెప్పారు. దీంతో ముగ్గురూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం మేరకు.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. భార్య చనిపోవడంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళకు 19, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు కూడా తల్లి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో మహిళతో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు అత్యంత నీచానికి పాల్పడ్డాడు. తల్లి లేని సమయంలో మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు.
పైగా, తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించి, బాలికలపై పదేపదే అత్యాచారం చేయసాగాడు. ఈక్రమంలో ప్రబుద్ధుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ సోకినట్లు తేలింది. ఈ విషయం తెలిసి బాలికలు ఆందోళన చెంది తల్లికి విషయం చెప్పారు. తమపై జరుగుతున్న ఘోరాన్ని బయటపెట్టారు. ఈ విషయం తెలిసి షాక్ అయిన సదరు మహిళ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.