ప్రాధేయపడినా కాపురానికి రాని భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!!

సెల్వి

శనివారం, 6 జులై 2024 (11:22 IST)
కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాత గుంతకల్లు పట్టణానికి చెందిన లోహిత్ కుమార్‌కు కర్నూలు జిల్లా ఎమ్మినూరుకు చెందిన లక్ష్మీదేవితో కొంతకాలం క్రితం వివాహమైంది. లక్ష్మీదేవి తరచూ పుట్టింటికి వెళ్లేది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. పలు మార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. 
 
ఆస్తి రాసి ఇస్తే కాపురానికి వస్తానని తెసేగి చెప్పడంతో కోడలి పేరిట 10 సెంట్లు, మనవడి పేరుతో మరో 10 సెంట్ల స్థలం రాసి ఇచ్చామని మృతుడి తండ్రి క్రిష్టప్ప చెబుతున్నారు. ఇటీవల మనవడు చనిపోవడంతో కోడలు పుట్టింటికి వెళ్లిపోయిందని అన్నారు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన పంచాయితీలో కాపురానికి వస్తానని చెప్పి రాకుండా భర్తకు ఫోన్ చేసి వేధింపులకు గురిచేయడం ప్రారభించిందని తెలిపారు. 
 
తాజాగా లీగల్ నోటీసు పంపించడతో ఆ బాధ భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోహిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి, బంధువులు ఆరోపించారు. లోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో అతడి కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రహదారిపై బైఠాయించారు. భార్య వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, కోడలిని రప్పించాలని డిమాండ్ చేశారు. 
 
ఆస్తి, డబ్బులు వెనక్కి ఇప్పించాలని, అప్పటివరకూ శవ పరీక్షలు చేయడానికి వీల్లేదని భీష్మించారు. న్యాయం చేస్తామని పోలీసులు భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు