హర్యానా రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. భార్యతో గొడవపడి నలుగురు కొడుకులతో తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ముందు పిల్లలందరికీ చిప్స్, కూల్ డ్రింక్స్ కొనిచ్చిన తండ్రి... ఆ తర్వాత వారిని రైలు కిందకు తోసేసి తాను కూడా ఆ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో ఆ తండ్రి తీసుకున్న నిర్ణయంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
బీహార్ రాష్ట్రంలోని సీతామర్హికి చెందిన మనోజ్ కుమార్ (45) అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తూ ఫరీదాబాద్లోని సుభాశ్ కాలనీలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఈ కాలనీ రైల్వే ట్రాక్లకు కేవలం 300 మీటర్ల దూరంలో ఉంది. మంగళవారం మధ్యాహ్నం మనోజ్ కుమార్ తన నలుగురు కుమారులతో కలిసి ఆల్సన్ చౌక్ వద్ద జీటీ రోడ్డుపై ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ దారుణానికి పాల్పడటానికి ముందు మనోజ్ కుమార్ అరగంటకు పైగా తన పిల్లలతో రైల్వే ట్రాక్ సమీపంలో కూర్చున్నట్టు కొందరు స్థానికులు చెప్పారు. ఆ సమయంలో మనోజ్ తన పిల్లలకు చిప్స్, కూల్డ్రింక్స్ కూడా కొనిచ్చినట్ట తెలిసింది. అయితే, ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఎవరూ ఊహించలేకపోయారు.
భార్య ప్రవర్తనే అనుమానంతో మనోజ్ తరచూ గొడవపడేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంగళవారం ఉదయం కూడా భార్య ప్రియతో మనోజ్కు తీవ్ర వాగ్వాదం జరిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లలను పార్కుకు తీసుకెళ్తున్నానని చెప్పి, వారిని రైల్వే ట్రాక్ల వద్దకు తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది.