ప్రియుడు మరో పెళ్లికి సిద్ధం కావడంతో యువతి ఆత్మహత్య

బుధవారం, 13 సెప్టెంబరు 2023 (14:13 IST)
హైదరాబాద్ నగరంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాను ప్రేమించిన యువకుడు మరో పెళ్లికి సిద్ధపడటంతో ఆ యువతి జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మంచిర్యాలలోని పద్మశాలీ కాలనీకి చెందిన ప్రైవేటు విద్యుత్తు పనిచేసుకునే రాజనర్సు, అంగన్‌వాడీ కార్యకర్త విజయలక్ష్మిల కూతురు మౌనిక(23) ఇంజినీరింగ్‌ పూర్తిచేసి నాలుగు నెలలుగా మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. స్నేహితురాలితో కలిసి అస్‌బెస్టాస్‌ కాలనీ సమీపంలోని నెహ్రూనగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటోంది. 
 
మౌనిక కొంతకాలంగా సాయికుమార్‌ అనే యువకుడిని ప్రేమిస్తోంది. అతన్ని పెళ్లి చేసుకుంటానని రెండు నెలల కిందట తల్లిదండ్రులకు చెప్పగా వారు నిరాకరించారు. ఈక్రమంలో ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. నిత్యం రాత్రి తల్లిదండ్రులు ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతుంటారు. 
 
సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులు ఆమెకు ఫోన్‌ చేయగా స్పందించలేదు. మంగళవారం ఉదయం ఫోన్‌ చేయగా స్పందించకపోవడంతో స్నేహితురాలికి ఫోన్‌ చేయగా.. వారం రోజుల నుంచి స్వగ్రామంలో ఉంటున్నట్లు చెప్పింది. స్నేహితుడిని గదికి పంపిస్తానని చెప్పి.. పంపగా తలుపులు తెరచుకుని ఉన్నాయి. మౌనిక అపస్మారకస్థితిలో ఉంది. 
 
ఆమె శరీరం ఆకుపచ్చ రంగులో కనిపించింది. పక్కన పురుగుమందు డబ్బా ఉండడంతో.. తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు