దారుణం, నాలుగున్నరేళ్ల పాపపై పినతండ్రి అనేకసార్లు అత్యాచారం, తల్లి చంపేసింది

ఐవీఆర్

గురువారం, 22 మే 2025 (12:43 IST)
కేరళలో దారుణ ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి, పినతండ్రి ఇద్దరూ చిన్నారి పాపను చిదిమేశారు. అభంశుభం తెలియని నాలుగన్నరేళ్ల పాపపై పినతండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడగా, ఆ పాపను తల్లి హత్య చేసింది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. మూజికులం నదిలో నాలుగున్నరేళ్ల పాప శవం బైటపడింది. ఆ బాలిక ఎవరో పోలీసులు చాలా త్వరగానే గుర్తించారు. దారి పొడవునా సిసి కెమేరాలు వుండటంతో చాలా సులభంగా నిందితురాలు తల్లేనని తేల్చారు.
 
తన కన్నబిడ్డను తనే నదిలో విసిరేసానంటూ బాలిక తల్లి అంగీకరించింది. ఐతే బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంతో షాకింగ్ విషయాలు వెలుగుచూసాయి. నాలుగన్నరేళ్ల పాపపై పలుమార్లు అత్యాచారం జరిగినట్లు తేలింది. శరీరంపై గాయాలున్నాయి. దీనితో పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా చేసారు. బాలికకు సంబంధించిన బంధువులందరినీ పిలిపించి విచారణ చేసారు. బాలిక పినతండ్రి వ్యవహారం కాస్త తేడాగా వుండటాన్ని గమనించారు. దీనితో అతడి వద్ద తమదైన శైలిలో పోలీసులు విచారణ జరిపారు.
 
దాంతో అతడు గావుకేకలు పెట్టి ఏడుస్తూ... ఆ పాపపు పని తనే చేసానంటూ పోలీసుల ఎదుట అంగీకరించాడు. చిన్నారిపై పలుమార్లు అత్యాచారం చేసినందుకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. ఇక ఆ బాలికను నదిలో విసిరేసి హత్య చేసిన తల్లిని ఇప్పటికే రిమాండుకు పంపారు. ఈ కేసు కేరళ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయినవారే అమ్మాయిల మానప్రాణాలను తీయడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు