ఆస్పత్రి ప్రాంగణంలోనే జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం..!!

ఠాగూర్

సోమవారం, 12 ఆగస్టు 2024 (16:32 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‍‌కతాలో ఓ ఆస్పత్రి ప్రాంగణంలోనే జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. కోల్కతాలోని ఆర్జీ‌కర్ మెడికల్ కాలేజీలో 28 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. శుక్రవారం రాత్రి అర్థనగ్నస్థితిలో బాధితురాలి దేహం లభ్యమైంది. నిందితుడు సంజయ్‌‍ను పోలీసులు అరెస్టు చేశారు. సంజయ్ రాయ్‌కు ఇదివరకే నాలుగుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. అతని ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతనిని వదిలి వెళ్లారు. నాలుగో భార్య ఏడాది క్రితం చనిపోయింది. సంజయ్ రాయ్ పోలీస్ పౌర వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. 
 
దీనిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జూనియర్ వైద్యురాలిపై ఆస్పత్రి ప్రాంగణంలోనే హత్యాచారం జరిగినట్టు ఆరోపణలు రావడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఇంతటి క్రూరత్వానికి ఒడిగట్టిన వారిని వదిలి పెట్టకూడదని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతి తెలిపారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టకూడదన్నారు. 
 
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మమత ప్రభుత్వం నేరస్తుడిని పట్టుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. హత్యాచారంపై బెంగాల్లో నిరసన తెలుపుతున్న వైద్యులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఆసుపత్రుల్లోనే డాక్టర్లు సురక్షితంగా ఉండలేకపోతే... ఇక ఆడపిల్లలు బయట క్షేమంగా ఉండగలరా? అని ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు