అనుమానం పెనుభూతమైంది.. భార్యను చంపేసిన భర్త... ఎక్కడ?

బుధవారం, 1 నవంబరు 2023 (09:31 IST)
అనుమానం పెనుభూతమైంది. ఈ కారణంగా ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండే పెనుకొండలో ఈ హత్య కలకలం రేపింది. తొలుత గుర్తు తెలియని మహిళ హత్యకు గురైనట్టు పోలీసులు భావించారు. కానీ, కొద్దిసేపటికే మృతురాలి వివరాలను పోలీసులు గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అనంతపురం జిల్లా పెనుగొండ - దేవ ఆర్అండ్ బీ మార్గంలోని అడ్డపుంత పంట కాలువలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడి చేరుకుని పరిశీలించగా మృతదేహం బోర్లా పడి ఉండటం, దుస్తులు చిరిగి ఉండటంతోపాటు గాయాలు ఉండటంతో వెంటనే అప్రమత్తమయ్యారు. మృతదేహాన్ని గట్టుకు చేర్చి వివాహితగా గుర్తించి, ఎవరనే దానిపై ఆరా తీయగా, మృతురాలు పెనుగొండ మండలం దొంగరావిపాలెం గ్రామానికి చెందిన నందిని (25) గా గుర్తించారు. పదునైన ఆయుధంతో ఆమె వీపు, ఎడమ జబ్బ, ఛాతిపై పొడిచి హత్యచేసిన అనంతరం పంట పొలాల మధ్య ఉన్న కాలువలో పడేసినట్లుగా భావిస్తున్నారు. 
 
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో పుట్టింట ఉన్న సమయంలో నందినికి కొఠాలపర్రు గ్రామానికి చెందిన చివటం రాంప్రసాద్ పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వీరు 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి 18 నెలల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం పెనుగొండలో నివసిస్తున్న భర్త రాంప్రసాద్ పెయింటింగ్ పని చేస్తుండగా నందిని ఇంటిపట్టునే ఉండేది. సోమవారం రాత్రి గౌరీపట్నంలోని తల్లి వద్దకు వెళ్దామని చెప్పి నందినిని బయటకు తీసుకొచ్చిన భర్త రాంప్రసాద్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
 
నిజానికి కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవలు పడుతున్నారు. సోమవారం ఉదయం తణుకు వచ్చిన అత్తగారిని కలిసిన రాంప్రసాద్ తన భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ చెప్పగా ఆమె సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. ఈలోగా క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని భావిస్తున్నారు. ఈ హత్య ఉదంతంలో భర్తతోపాటు మరెవరన్నా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. భర్త రాంప్రసాద్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. గ్రామ వీర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు