రూ.4 కోట్ల బీమా డబ్బు కోసం స్నేహితుడి దారుణం...

శుక్రవారం, 30 జూన్ 2023 (10:49 IST)
నాలుగు కోట్ల రూపాయల బీమా సొమ్ము కోసం మరో స్నేహితుడి దారుణానికి పాల్పడ్డాడు. పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వ్యాపారంలో నష్టాలు రావడంతో దురాలోచనకు పాల్పడ్డాడు. రూ.4 కోట్ల బీమా డబ్బును పొందడానికి తన స్నేహితుడిని చంపేసి తానే చనిపోయినట్లు భార్యతో కలసి నాటకమాడాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. 
 
గురుప్రీత్‌ సింగ్‌ అనే వ్యాపారవేత్త సైన్‌పుర్‌ ప్రాంతానికి చెందిన సుఖ్‌జీత్‌ను చంపాలనే కుట్రతో అతడితో స్నేహం చేశాడు. ఈ నెల 19న గురుప్రీత్‌.. సుఖ్‌జీత్‌కు పూటుగా మద్యం తాగించాడు. అతడు మత్తులోకి జారుకున్నాక చంపేశాడు. అనంతరం మృతుడికి తన బట్టలు తొడిగాడు. తర్వాత మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ట్రక్కు కింద తొక్కించినట్లు పోలీసులు తెలిపారు. 
 
గురుప్రీత్‌ భార్య ఆ మృతదేహం తన భర్తదే అని అబద్ధమాడినట్లు పేర్కొన్నారు. గురుప్రీత్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు 20న రాజ్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురుప్రీత్‌ గత కొన్ని రోజులుగా తన భర్తతో కలిసి మద్యం తాగుతున్నట్లు సుఖ్‌జీత్‌ భార్య పోలీసులకు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు గురుప్రీత్‌ కుటుంబ సభ్యులను మళ్లీ విచారించగా అతడు బతికే ఉన్నట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి గురుప్రీత్‌తో పాటు అతని భార్యను, మరో నలుగురిని అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు