రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

ఐవీఆర్

సోమవారం, 30 జూన్ 2025 (14:42 IST)
తమిళనాడులోని తిరుప్పూర్‌లో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వివాహం చేసుకున్న కేవలం 78 రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం వెనుక వరకట్నమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనితో వివాహిత భర్త, అత్తమామలను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి తండ్రి అన్నాదురై ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. గత ఫిబ్రవరి నెలలో తన కుమార్తె రిత్యన్య వివాహాన్ని 2.5 కోట్ల రూపాయల ఖర్చుతో ఘనంగా వివాహం చేసారు. వరుడికి రూ. 70 లక్షల విలువ చేసే వోల్వో కారు బహూకరించారు. 300 సవర్ల బంగారు నగలు కుమార్తెకి ఇచ్చారు. ఐతే పెళ్లికి ముందు 500 సవర్లు ఇస్తానని రితన్య తండ్రి మాట ఇచ్చాడు. ఐతే దానికి గడువు కూడా పెట్టుకున్నాడు. ఐతే పెళ్లయిన 10 రోజులకే మిగిలిన 200 సవర్లు బంగారం ఎప్పుడు తెస్తావంటూ వేధింపులు స్టార్ట్ చేసారు అత్తవారింటివారు.
 
వివరాల్లోకి వెళితే.. రితన్య(27)కు, కవిన్ కుమార్ (28)తో పెళ్లి జరుగగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడంతో పురుగుమందు తాగి రితన్య ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలల క్రితం ఈ జంట వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. వివాహం జరిగిన కొన్ని వారాల తర్వాత రితన్య తన భర్త, అతని తల్లిదండ్రులు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని తన తల్లిదండ్రులకు రితన్య ఫోనులో చెప్పింది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రితన్య తన ఆత్మహత్యకు కారణాలు చెబుతూ తన తండ్రికి వాట్సాప్‌లో వాయిస్ నోట్ పంపింది. తండ్రి ఆమెను వారించేలోపుగానే ఆమె ఈ దారుణమైన చర్యకు పాల్పడింది. మధ్యాహ్నం సమయంలో మొండిపాళయం వద్ద కారులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కారులో ఆమె మృతి చెంది కనిపించిందని, మృతదేహాన్ని అవినాశిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేయూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు