కర్నాటక లోని నేలమంగళకు చెందిన నేత్రావతి, రమేష్ దంపతులు. వీరికి ఓ కుమారుడు కూడా వున్నాడు. రమేష్ ట్రక్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. డ్రైవర్ కావడంతో రోజుల తరబడి ఇంటికి దూరంగా వుండాల్సిన పరిస్థితి. దాంతో కుమారుడి ఆలనాపాలనా అన్నీ తానై చూసుకుంటూ వస్తోంది నేత్రావతి. ఇటీవల ఇంటికి వచ్చిన రమేష్, భార్య నేత్రావతి ప్రవర్తనపై మండిపడ్డాడు. దీనితో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. నేత్రావతి వెంటనే పోలీసు స్టేషనులో భర్తపై ఫిర్యాదు చేసింది.
తనను మానసిక వేధించడమే కాకుండా భౌతికంగా కూడా వేధిస్తున్నాడంటూ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రమేష్ ను పిలిపించి నేత్రావతికి-అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేసారు. ఐనప్పటికీ ఇద్దరి మధ్య మనస్పర్థలు అలానే సాగుతున్నాయి. ఇదిలావుండగానే ఓరోజు నేత్రావతి ఇంటి నుంచి తన కుమారుడితో సహా కనిపించకుండా పోయింది. తన భార్య ఎటు వెళ్లిందా అని వెతికేలోపుగా అతడి వాట్సాప్ కి కొన్ని ఫోటోలు వచ్చాయి. వాటిని చూసి రమేష్ షాక్ తిన్నాడు. అందులో వున్నది తన భార్యే.
కాకపోతే ఆమె ఎవరో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ ఫోటోలను షేర్ చేసింది. వీటిని చూసిన రమేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అంతకంటే ముందుగానే నేత్రావతి ఓ లాయర్, ఓ పోలీసును వెంటబెట్టుకుని తన మాజీ భర్త రమేష్ ఇంటికి వచ్చి తనకు సంబంధించిన సామాన్లన్నింటినీ సర్దుకుని వెళ్లిపోయింది. ఇదంతా చూస్తూనే వున్న రమేష్ షాకయ్యాడు. తనతో ఇన్నాళ్లు సంసారం చేసిన నేత్రావతి కేవలం 7 రోజుల్లో ఎలా మనసు మార్చుకుందీ. ఇదంతా ఓ కుట్ర, ఓ మాయ అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు.