అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

ఠాగూర్

ఆదివారం, 20 జులై 2025 (11:37 IST)
తన వివాహేదర సంబంధాన్ని ప్రియుడు భార్యకు చెప్పి గొడవకు కారణమైమయ్యాడని భావించిన ఓ మహిళ.. విలేఖరిని హత్యకు ప్లాన్ చేసింది. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌కు డబ్బులు చెల్లించి దొరికిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం తిమ్మాపురంలో జరిగింది. ప్రియుడితో కలిసి నలుగురికి మహిళ సుపారీ ఇవ్వగా, ఆ గ్యాంగ్ రిపోర్టర్‌ను కాకుండా మరో వ్యక్తిపై దాడి చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ కేసులో సదరు మహిళతో పాటు ఆమె ప్రియుడు, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఎస్.రాయవరానికి చెందిన మేడిశెట్టి నూకేశ్వరికి తునికి చెందిన వ్యక్తితో గతంలో వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా మూడేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. ఆమె భర్తకు దూరంగా ఉంటున్నా తరచూ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ తరుణంలో ఓ ఛానల్ రిపోర్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఈ సమస్యను పోలీసుల ద్వారా పరిష్కరిస్తానని నూకేశ్వరిని నమ్మబలికి ఆమె వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, 6.5 తులాల బంగారం తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత సదరు రిపోర్టర్, నూకేశ్వరికి మధ్య గొడవ జరగడంతో తన వద్ద తీసుకున్న నగలు, నగదు వెనక్కి ఇవ్వాలని సూకేశ్వరి డిమాండ్ చేసింది. అతను ఇవ్వకపోవడంతో రిపోర్టర్‌పై నూకేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తనపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో సదరు రిపోర్టర్ నూకేశ్వరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న పైడిరాజు అనే వ్యక్తి భార్యకు వీరి సంబంధం గురించి చెప్పాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవకు కారణమైన రిపోర్టర్‌ను అంతమొందించాలని సూకేశ్వరి, ఆమె ప్రియుడు పైడిరాజు పథకం రచించారు. ఇందుకు తుని ప్రాంతానికి చెందిన కిరాయి రౌడీలు సాకాడ్ అలియాస్ శ్యామ్, కిసరపూడి జాను ప్రసాద్, రాయడి రాజ్ కుమార్ లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
ఈ నెల 11న ముగ్గురు కిరాయి రౌడీలకు రిపోర్టర్ ఇంటిని నూకేశ్వరి, పైడిరాజులు చూపించారు. రౌడీలు అదే రోజు రాత్రి మద్యం సేవించి రిపోర్టర్ ఇంటి పక్కన ఉన్న నాగేశ్వరరావు అనే వ్యక్తిపై రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెల్లడైంది. దీంతో నూకేశ్వరి, ఆమె ప్రియుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న సుపారీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు