హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన నూతన దంపతుల్లో భర్త అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో భార్యను ప్రధాన సూత్రధారిగా భావించారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఓ షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. మృతుడి భార్యతో సహా మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. ఈ దారుణానికి పాల్పడింది కూడా బాధితుడుకి అత్యంత సన్నిహితులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్ రఘువంశీ ఇటీవలే వివాహం చేసుకుని హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 23న వీరిద్దరూ అదృశ్యమయ్యారు. అంతకుముందు షిల్లాంగ్లోని ఓ హోటల్ బయట, ఆ తర్వాత నాంగ్రియాట్ గ్రామంలో మరో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
జూన్ 2వ తేదీన తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా పరిధిలోని సోహ్రా ప్రాంతంలో ఒక జలపాతం సమీపంలోని లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఆయనను కత్తితో దారుణంగా పొడిచి చంపినట్లు నిర్ధారణ అయింది. సంఘటనా స్థలం నుంచి పలు విలువైన వస్తువులు కూడా మాయమైనట్లు తేలింది.
మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు భావించినప్పటికీ, లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. రాజా రఘువంశీ హత్య వెనుక ఆయన భార్య సోనమ్ హస్తం ఉందని, ఆమెనే ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించిందని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు వ్యక్తులను కిరాయికి మాట్లాడుకుని సోనమ్ ఈ ఘాతుకానికి పాల్పడిందని వారు వెల్లడించారు.
కొన్ని రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన సోనమ్, ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లా నందగంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో ఈ కేసులో కీలక లీడ్ లభించింది. అనంతరం ఇండోర్, ఉత్తరప్రదేశ్లో పోలీసులు సమన్వయంతో రాత్రిపూట దాడులు నిర్వహించి, హత్యలో పాలుపంచుకున్న మిగిలిన ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసును కేవలం ఏడు రోజుల్లో ఛేదించిన రాష్ట్ర పోలీసుల పనితీరును మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రశంసించారు. "ఏడు రోజుల్లోనే ఈ కేసులో కీలక పురోగతి సాధించారు... చాలా బాగా పనిచేశారు" అని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కూడా ఆయన తెలిపారు. మరోవైపు భార్యే.. భర్తను హత్య చేయడానికి గల కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు.