తండ్రిని చంపిన తనయుడు.. ఎందుకో తెలుసా?

మంగళవారం, 29 ఆగస్టు 2023 (16:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కన్నతండ్రిని కుమారుడు చంపేశాడు. విద్యుత్ బిల్లు విషయంలో తండ్రికొడుకుల మధ్య జరిగిన వివాదం ఈ హత్యకు దారితీసింది. జిల్లాలోని అత్తెల్లి గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వారు నివాసం ఉంటున్న ఇంటి కరెంటు బిల్లు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లును నువ్వు కట్టు అంటే.. నువ్వు కట్టు.. అంటూ పరస్పరం గొడవకు దిగారు. ఈ గొడవ తారస్థాయికి చేరింది. దీంతో ఈ తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ గ్రామ పెద్దల వరకు వెళ్లింది.
 
గ్రామ పెద్దలు మాట్లాడుతుండగానే తండ్రి రామచంద్రయ్యపై కుమారుడు యాదయ్య రాడ్డుతో దాడి చేశాడు. దీంతో రామచంద్రయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే పంచాయతీ పెద్దలు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యాదయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్‌ పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు